అక్షర ఆయుధం న్యూస్, జూన్ 13, ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం (వి . బన్సిలాల్):గాదెపాడు గ్రామానికి నాలుగు దశాబ్దాలపాటు పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందించి ప్రజల మన్ననలు పొందిన పుచ్చకాయల వెంకటేశ్వర్లు గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గాదెపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ రంజిత్ కుమార్, ఉప సర్పంచ్ ఉపేందర్, కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మువ్వ విజయబాబు, మాజీ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి.వి. గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమార్, గ్రామ పెద్దలు మర్ల వెంకటరెడ్డి, బత్తుల బాబురావు, ఎలమంచి భాస్కరరావు, మధ్యబోయిన జోగయ్య, గడిపర్తి వీరన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా పుచ్చకాయల వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలకు పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి వేలాది మంది ఖాతాదారులకు సేవలందించారని కొనియాడారు. పోస్టల్ సేవింగ్స్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పథకాలు, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు, పోస్టల్ బాండ్లు వంటి అనేక సేవలను ప్రజలకు చేరవేసి ఆర్థిక భద్రత కల్పించడంలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.అలాగే ఈ ప్రాంత రైతులకు వ్యవసాయ అవసరాల కోసం సలహాలు, సహకారం అందిస్తూ సామాజిక బాధ్యతతో పనిచేశారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా గ్రామాభివృద్ధికి తన అనుభవంతో సలహాలు, సూచనలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు గారిని ఘనంగా సన్మానించి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సేవల పట్ల ఆయన చూపిన అంకితభావం ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు.